కరోనా వైరస్: 12 లక్షలు దాటిన బాధితులు.. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,100 మంది మృతి

చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ప్రాణాంతక కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రజలు ప్రాణాలే కాదు.. వారి జీవనోపాధి అగమ్యగోచరంగా మారింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నాయి. మొత్తం 350 కోట్ల మంది ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఐరోపాతోపాటు అమెరికాలోనూ వైరస్ తీవ్రత ప్రబలంగా ఉంది. అమెరికాలో వేలల్లోనే కొత్త కేసులు నిర్ధారణ అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది.


ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 64,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 5,500 మంది మృతిచెందడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. వైరస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకు 246,000 మంది కోలుకున్నారు. మరో 8.80 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 42,300 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

కరోనా మరణాల్లో ఇటలీ, స్పెయిన్‌లతో అమెరికా పోటీపడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమవుతోంది. ఇటలీ, స్పెయిన్‌లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలోనే కోవిడ్ మరణాల సంఖ్య 15,361కు చేరుకోగా... శనివారం మరో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కొత్తగా దాదాపు 5,000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 124,632కి చేరింది. అయితే, ఇటలీలో వైరస్ సంక్రమణ నెమ్మదించడం ఊరట కలిగించే అంశం.

మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యువు కరాళనృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ 24 గంటల్లో ఇంత ప్రాణనష్టం జరగలేదు. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 630 మంది మృతిచెందారంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులనైనా ఉపయోగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వైద్యపరమైన మాస్కులను మాత్రం వైద్య సిబ్బంది కోసం వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 311,357 చేరుకోగా, 8,452 మంది బలయ్యారు.